సోషల్ మీడియాలో కొన్ని రకాల ఆహార పదార్థాలను మళ్లీ వేడి (Reheat) చేసి తింటే అవి విషంగా మారతాయనే ప్రచారం తరచూ కనిపిస్తూ ఉంటుంది. పుట్టగొడుగులు (Mushrooms), పాలకూర (Spinach), చికెన్ (Chicken), బంగాళాదుంపలు (Potato), అన్నం (Rice) మరియు గుడ్లు (Eggs) వంటి పదార్థాలను తిరిగి వేడి చేయడం ప్రమాదకరమని చెబుతుంటారు. అయితే, ఈ విషయంలో ఉన్న అసలు నిజం ఏంటి?
నిజానికి, ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం అసలు సమస్య కాదు . వండిన ఆహారాన్ని సరైన రీతిలో నిల్వ (Storage) చేయకపోవడమే ప్రధానమైన సమస్య .
వండిన పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు బయట వదిలేయడం వల్ల లేదా సరిగ్గా ఫ్రిజ్లో దాచకపోవడం వల్ల వాటిపై కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశం ఉంది. ఈ సూక్ష్మజీవులు పెరగడం వల్ల ఆ ఆహారం ఫుడ్ పాయిజనింగ్కు (Food Poisoning) దారితీస్తుంది .
కాబట్టి, ఆహారం విషపూరితంగా మారకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. సరైన నిల్వ పద్ధతులు: మిగిలిపోయిన ఆహారాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకుండా, తగినంత ఉష్ణోగ్రత వద్ద సురక్షితంగా నిల్వ చేయాలి. ఆహారాన్ని దాచే పాత్రలు, ఫ్రిజ్ వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
నిల్వ చేసిన ఆహారాన్ని తినేముందు తగినంత ఉష్ణోగ్రత వద్ద సమానంగా వేడి చేయాలి. ఆహారాన్ని తిరిగి వేడి చేయడం కంటే, వండిన తర్వాత దాన్ని ఎంత సురక్షితంగా, పరిశుభ్రంగా నిల్వ చేస్తున్నామనేదే మన ఆరోగ్యానికి అత్యంత కీలకమని వైద్య నిపుణులు అంటున్నారు.
