కళలకు, సంగీతానికి ఎల్లలు లేవని మరోసారి రుజువైంది. మన తెలుగు సినిమా ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్న టైమ్ లో.. మన పాటలు కూడా ఇతర దేశాల శ్రోతలను అలరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా శాస్త్రీయ నృత్యాలు కేవలం భారతదేశాని మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఒక యువతి, రెండేళ్ల క్రితం నాటి ఒక తెలుగు హిట్ పాటకు వేసిన క్లాసికల్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
శాస్త్రీయ నృత్యంతో మెప్పించిన చైనీస్ డ్యాన్సర్:
ప్రభాస్, త్రిష జంటగా ఎం.ఎస్. రాజు నిర్మించిన ‘పౌర్ణమి’ (2006) చిత్రంలోని “భరత వేదముగా…” పాట ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ క్లాసికల్ మెలోడీకి చైనాకు చెందిన మీరా వాంగ్ అనే యువతి అద్భుతమైన భారతీయ శాస్త్రీయ నృత్య రీతిలో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. పాటలోని ప్రతీ భావానికి తగ్గట్టుగా ఆమె పలికించిన అభినయం, వేసిన ముద్రలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు భాష, సంస్కృతిపై అవగాహన లేకపోయినా.. పాటలోని భావాన్ని పట్టుకుని ఆమె చేసిన ఈ ప్రదర్శన టాలీవుడ్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.
ఇంతకీ ఎవరీ మీరా వాంగ్?
చైనాలో ఉంటూనే భారతీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగు శాస్త్రీయ నృత్యం పట్ల మీరా వాంగ్ ఎంతో మక్కువ పెంచుకున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన వేణుగోపాల్ అనే క్లాసికల్ డ్యానసర్ వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్కు రాకపోయినా, ఆన్లైన్ ద్వారా నృత్య రీతులను అభ్యసిస్తూ తన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
గతంలో కూడా ఆమె ‘మాయాబజార్’ చిత్రంలోని విశ్వవిఖ్యాత పాట “అహా నా పెళ్లంట”కు డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు. భాషా సరిహద్దులను దాటి, మన తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఒక శాస్త్రీయ పాటను చైనా వేదికగా ఇంత అందంగా ప్రదర్శించడంపై సోషల్ మీడియా వేదికగా మీరా వాంగ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
