అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆహ్వానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు–ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్–2 వంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానుండగా, పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న తన అభ్యర్థన మేరకే విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమం జరుగుతోందని పవన్ కళ్యాణ్ వివరించినప్పటికీ, ఒకే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు నేతల కార్యక్రమాలు ఒకే రోజున ఇలా వేర్వేరు దిశల్లో సాగడం రాజకీయ చర్చకు కారణమవుతోంది. అమరావతి ప్రాజెక్టులపై జరుగుతున్న విమర్శలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం జనసేన–టీడీపీ మధ్య సమన్వయంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కూటమి బయటకు ఐక్యతను ప్రదర్శిస్తున్నప్పటికీ, లోపల మాత్రం విభేదాల గ్యాప్ పెరుగుతోందా? అనే చర్చ ప్రారంభమైంది. రానున్న రోజుల్లో ఇరు పార్టీల అగ్రనాయకత్వం వ్యవహరించే తీరు ఇంకెన్నీ ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వనుందో చూడాలి.
